జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు

V. Sai Krishna Reddy
1 Min Read

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై బోరబండ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. పార్టీ గుర్తుతో కూడిన ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతో ఉన్న ఓటర్ స్లిప్పులను ప్రజలకు పంచుతున్నారని కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ ఛైర్మన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇది ఎన్నికల నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నేరుగా రిటర్నింగ్ అధికారికి (ఆర్వో) లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును స్వీకరించిన రిటర్నింగ్ అధికారి, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఆర్వో ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బోరబండ పోలీసులు, మాగంటి సునీతపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *