తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన నలుగురు నాన్-కేడర్ సీనియర్ పోలీసు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందన్ కుమార్ అధికారికంగా ఆదేశాలు విడుదల చేశారు.
పదోన్నతి పొందిన అధికారుల జాబితాలో సీహెచ్. సమయ్ జాన్రావు, ఎస్. శ్రీనివాస్, కె. గుణశేఖర్, డి. సునీత ఉన్నారు. వీరంతా ప్రస్తుతం వివిధ విభాగాల్లో ఎస్పీ హోదాలో సేవలు అందిస్తున్నారు. తాజా ఉత్తర్వులతో వీరికి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కేడర్కు ప్రమోషన్ లభించినట్లయింది.
ఈ నెల 24న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో సెలెక్ట్ కమిటీ సమావేశం జరిగింది. 1955లోని రెగ్యులేషన్ 7, సబ్-రెగ్యులేషన్ (3) నిబంధనల ప్రకారం ఈ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగానే కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పదోన్నతులతో రాష్ట్ర పోలీసు శాఖలో అధికారుల బాధ్యతలు మరింత పెరగనున్నాయి. సీనియర్ అధికారులకు ఐపీఎస్ హోదా లభించడంపై శాఖలో హర్షం వ్యక్తమవుతోంది.
