తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో లేకుండానే రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘సామాజిక తెలంగాణ’ లక్ష్యంగా, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె నిర్ణయించుకోవడం కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
దీపావళి పండుగ తర్వాత ఈ యాత్రను ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో పర్యటించాలని కవిత ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఖరారైందని తెలుస్తోంది. తన యాత్ర వివరాలతో కూడిన పోస్టర్ను ఆమె ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ యాత్రలో భాగంగా కవిత రాష్ట్రంలోని మేధావులు, విద్యావంతులు, వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాజకీయంగా భవిష్యత్తులో ఎలా ముందడుగు వేయాలనే అంశంపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, ఇప్పుడు చేపట్టబోయే ఈ యాత్రకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రజల నుంచి వచ్చే స్పందన, మద్దతును అంచనా వేసిన తర్వాత కవిత తన సొంత పార్టీని ప్రకటించే యోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఫొటోను పక్కనపెట్టి యాత్ర చేయాలన్న నిర్ణయం ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మొత్తంగా, కవిత యాత్ర తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.