మోగిన జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల నగారా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

V. Sai Krishna Reddy
1 Min Read

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల హడావుడి అధికారికంగా మొదలైంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 13 నుంచి 21వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి, 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. నవంబర్ 16 నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుందని అధికారులు తెలిపారు.

ఈ ఉప ఎన్నికకు సంబంధించి షేక్‌పేట ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు ఆయన సూచనలు చేశారు.

అభ్యర్థుల సౌలభ్యం కోసం ‘సువిధ’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్ పత్రాలను నింపే అవకాశం కల్పించారు. అయితే, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసినప్పటికీ, అభ్యర్థి తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి ముందు స్వయంగా హాజరై సంతకం చేసి, ప్రమాణం చేయాల్సి ఉంటుంది.

ఇక ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయానికొస్తే, బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతా గోపీనాథ్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్‌ పోటీ చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ అభ్యర్థిని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. దీంతో జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *