బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.. పిటిషన్లన్నీ కలిపి విచారణ

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లను ఈ రోజు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమర్థిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని పేర్కొంది.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ-9ను సవాల్ చేస్తూ బి. మాధవరెడ్డి, ఎస్. రమేశ్ మరికొందరు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఉండగా, బీసీ కోటాను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచడంతో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇది సుప్రీంకోర్టు ఇంద్రా సహానీ కేసులో నిర్దేశించిన 50 శాతం పరిమితిని ఉల్లంఘించడమేనని వారు వాదించారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బీసీ కోటా పెంపు కోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285-ఏను సవరించామని అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం ఇంకా లభించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.

ఈ వివాదం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నేతలు వి. హనుమంతరావు, చరణ్ కౌశిక్, ఇందిరా శోభన్ సహా పలువురు నేతలు ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, అక్టోబర్-నవంబర్ నెలల్లో ఐదు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ విచారణ ఫలితం ఆ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *