దేశ ప్రజలకు ప్రధాని మోదీ దసరా శుభాకాంక్షలు

V. Sai Krishna Reddy
1 Min Read

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ పండుగ, ప్రజలందరిలో ధైర్యం, వివేకంతో ముందుకు సాగే స్ఫూర్తిని నింపాలని ఆయన ఆకాంక్షించారు.

గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) వేదికగా మోదీ తన సందేశాన్ని పంచుకున్నారు. “అసత్యంపై సత్యం, చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి నిలువెత్తు నిదర్శనం. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ధైర్యం, వివేకం, భక్తి మార్గంలో నిరంతరం ముందుకు సాగే స్ఫూర్తిని పొందాలని కోరుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మోదీ తన పోస్ట్‌లో రాశారు.

ప్రధానితో పాటు పలువురు ముఖ్యమంత్రులు కూడా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ, సత్యం, సన్మార్గం, సత్ప్రవర్తనల శాశ్వత విజయానికి ఈ పండుగ ప్రతీక అని అన్నారు. శ్రీరాముడి దయతో ప్రతి హృదయం సత్యం, ధర్మం అనే వెలుగుతో నిండిపోవాలని ఆకాంక్షించారు.

అలాగే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “జీవితంలో సత్యం, ధర్మం, శాశ్వత విలువలకు కట్టుబడి ఉండటమే అసలైన విజయమని దసరా పండుగ గుర్తు చేస్తుంది. మనందరినీ ధర్మం, కర్తవ్యం, మానవత్వ మార్గంలో నడిపించే స్ఫూర్తిని ఈ పండుగ ఇస్తుంది” అని ఆమె పేర్కొన్నారు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు వెల్లివిరియాలని కోరుకున్నారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వీయుజ మాసంలో శరన్నవరాత్రుల ముగింపుగా పదో రోజున విజయదశమిని జరుపుకుంటారు. ‘విజయ’ అంటే గెలుపు, ‘దశమి’ అంటే పదో రోజు అని అర్థం. చెడు శక్తులపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *