కాంతార’ వేడుకకు ఎన్టీఆర్.. హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్

V. Sai Krishna Reddy
1 Min Read

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో వస్తున్న ‘కాంతార: ఏ లెజెండ్’ చిత్రం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. కన్నడలో సంచలనం సృష్టించిన ‘కాంతార’కు ప్రీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు ఓ అదిరిపోయే అప్డేట్ ను చిత్రబృందం అందించింది. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ వేడుకకు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా రేపు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ఈ ఈవెంట్ ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల కాగా, ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ ఈవెంట్ తో సినిమా ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో మరో స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి స్నేహబంధం ఉంది. ఎన్టీఆర్ తల్లి కర్ణాటకకు చెందిన వారు కావడంతో ఆయనకు కన్నడ పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో తన కుటుంబంతో కలిసి కర్ణాటక పర్యటనకు వెళ్లినప్పుడు ఎన్టీఆర్, రిషబ్ శెట్టి ఫ్యామిలీని కలుసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, దిల్షాన్ దేవయ్య ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *