తెలంగాణకు డబుల్ అలర్ట్.. పొంగుతున్న నదులు, పొంచి ఉన్న అతి భారీ వర్షాలు

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు వరద నీటితో ఉప్పొంగుతుండగా, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం నేడు అల్పపీడనంగా, రేపు వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది శనివారం నాటికి తీరం దాటే అవకాశం ఉందని, దీని ఫలితంగా శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేశారు.

మరోవైపు, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా బేసిన్‌లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి అత్యంత చేరువలో ఉంది. బుధవారం సాయంత్రం నాటికి ప్రాజెక్టులోకి 3.66 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, దాదాపు 3.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి సైతం భారీగా వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే సాగర్‌కు వదులుతున్నారు.

ఇక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తడంతో అధికారులు మొత్తం 8 గేట్లను ఎత్తి 67 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నిండుగా ఉన్న జలాశయాలకు రాబోయే వర్షాలు తోడైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *