ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తీసుకువచ్చిన రూ.1కే అపరిమిత సేవలు అందించే “ఆజాదీ కా ప్లాన్”కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో ఈ ప్లాన్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టులో ఈ ప్రత్యేక ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
వినియోగదారుల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో ఈ ప్రత్యేక ఆఫర్ను తాజాగా సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్లాన్.. తాజా నిర్ణయంతో ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండనుంది.
ఒక రూపాయికే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్మెస్లు లభించే ఈ ప్లాన్తో వినియోగదారులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, 4జీ సిమ్ ఉచితంగా అందుతోంది.
బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఎ. రాబర్ట్ జె. రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “మేక్ ఇన్ ఇండియా కింద దేశవ్యాప్తంగా ఆధునిక 4జీ నెట్వర్క్ను ప్రారంభించాం. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు కొత్త 4జీ సేవలను తక్కువ ఖర్చుతో ఉపయోగించేందుకు అవకాశం లభిస్తోంది,” అన్నారు.
ఈ ప్లాన్ను పొందాలంటే వినియోగదారులు సమీప బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) లేదా ఆధికారిక రిటైలర్ను సంప్రదించాలి. మరిన్ని వివరాల కోసం 1800-180-1503కు కాల్ చేయవచ్చు లేదా www.bsnl.co.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.