ఏలూరు జిల్లాలో కలకలం.. విధుల్లో ఉన్న ఎస్బీ కానిస్టేబుల్ అదృశ్యం

V. Sai Krishna Reddy
1 Min Read

ఏలూరు జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) కానిస్టేబుల్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కామవరపుకోట, టి.నరసాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న బి.సుబ్బారావు శుక్రవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళనకు గురైన ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సుబ్బారావు రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తూ కామవరపుకోటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఆయన బుట్టాయగూడెం నుంచి వచ్చి రాత్రి విధులకు హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ సిగ్నల్ పనిచేయడం లేదు. ఆయన నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం తడికలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కామవరపుకోటకు చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు, సుబ్బారావు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఫోన్ సిగ్నల్ చివరిసారిగా ఎక్కడ ఆగిపోయిందో ఆ ప్రాంతంతో పాటు టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో గాలిస్తున్నారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అదృశ్యం కావడంతో ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *