హైదరాబాద్, ప్రజాజ్యోతి : స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి మంత్రివర్గం ఆమోదించింది. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిగింది. సెప్టెంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. సర్కార్ తాజా నిర్ణయంతో సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించనుంది.రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285 (ఏ) పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం-2018, సెక్షన్ 285 (ఏ) కు సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. స్థానిక సంస్థల్లోని 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తవేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో తీసుకురావాలని నిర్ణయించారు.
