.70 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్

V. Sai Krishna Reddy
1 Min Read

రంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఓ అవినీతి అధికారి చిక్కారు. ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన వనస్థలిపురం సబ్-రిజిస్ట్రార్ ఎస్. రాజేష్ కుమార్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఆయన తరఫున ఒక ప్రైవేట్ వ్యక్తి డబ్బు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ ఫిర్యాదుదారుడి ఆస్తి రిజిస్ట్రేషన్ పని చేసిపెట్టేందుకు సబ్-రిజిస్ట్రార్ రాజేష్ కుమార్ లక్ష రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా ప్రణాళికతో నిందితుడిని పట్టుకునేందుకు వలపన్నారు.

లంచం డబ్బులో మొదటి విడతగా రూ.70,000 ఇవ్వాలని సబ్-రిజిస్ట్రార్ సూచించారు. ఈ మొత్తాన్ని నాగోల్‌లో నివాసముంటున్న కె. రమేష్ అనే ప్రైవేట్ దస్తావేజు లేఖరి కార్యాలయంలోని టైపిస్టుకు అందజేయాలని చెప్పారు. బాధితుడు శుక్రవారం రమేష్‌కు డబ్బు ఇస్తుండగా, అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సబ్-రిజిస్ట్రార్ రాజేష్ కుమార్ ఆదేశాల మేరకే తాను ఈ డబ్బును స్వీకరించినట్లు రమేష్ అంగీకరించడంతో, ఇద్దరినీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే ఏమాత్రం భయపడకుండా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయవచ్చని తెలిపారు. అలాగే, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *