ఫేస్‌బుక్ ప్రేమ.. యువకుడికి 13 గంటల నరకం చూపించిన యువతి కుటుంబం

V. Sai Krishna Reddy
1 Min Read

సోషల్ మీడియాలో పరిచయాలు కొన్నిసార్లు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఫేస్‌బుక్‌లో పరిచయమైన స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు బంధించి, దాదాపు 13 గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. రేవా జిల్లా బైకుంఠ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడికి మౌగంజ్ జిల్లా పిప్రాహి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆమెను కలిసేందుకు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించి శనివారం ఆ యువకుడు పిప్రాహి గ్రామానికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు అతడిని పట్టుకున్నారు. చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి, శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు సుమారు 13 గంటల పాటు తీవ్రంగా కొట్టారు. ఈ దాడినంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియో తమ దృష్టికి వచ్చినట్టు ఎస్పీ ఆర్.ఎస్. ప్రజాపతి బుధవారం మీడియాకు తెలిపారు. “సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మా దృష్టికి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మైనర్ బాలికను కలిసేందుకు ఆ యువకుడు వచ్చాడు. ఈ ఘటనపై హనుమాన పోలీస్ స్టేషన్‌లో ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదు. అయినప్పటికీ, దీనిపై పూర్తి సమాచారం సేకరించి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌ను ఆదేశించాం” అని ఆయన వివరించారు. వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *