జియో యూజర్లకు షాక్.. ఆ పాప్యులర్ ప్లాన్లు బంద్‌

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఎంతో ఆదరణ పొందిన, తక్కువ ధరకే లభించే రోజువారీ 1జీబీ డేటా ప్లాన్‌లను నిలిపివేసింది. దీంతో జియో బేసిక్ ప్లాన్‌ల స్వరూపం పూర్తిగా మారిపోయింది.

ఇంతకాలం జియోలో రోజుకు 1జీబీ డేటా అందించే ప్లాన్‌లలో రూ. 209 (22 రోజుల వ్యాలిడిటీ), రూ. 249 (28 రోజుల వ్యాలిడిటీ) ప్లాన్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ రెండు ప్లాన్‌లను తమ జాబితా నుంచి తొలగించింది. దాంతో రోజువారీ డేటా అందించే ప్లాన్‌లలో అత్యంత చౌకైన ఆప్షన్‌గా రూ. 299 ప్లాన్ ముందుకు వచ్చింది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా వ‌స్తుంది.

ఒకవైపు ప్లాన్‌ల ప్రారంభ ధరను పెంచుతున్నప్పటికీ, జియో యూజర్ బేస్ మాత్రం గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లో జియో ఏకంగా 19 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. ఇది ప్రధాన పోటీదారు అయిన ఎయిర్‌టెల్ సాధించిన వృద్ధి కంటే రెట్టింపు కావడం విశేషం. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు తమ వినియోగదారులను కోల్పోయాయి.

పాత ప్లాన్‌లతో పోలిస్తే ఇప్పుడు కనీస రీఛార్జ్ మొత్తం పెరిగినప్పటికీ, దానికి బదులుగా ఎక్కువ రోజువారీ డేటాను జియో అందిస్తోంది. గతంలో 1జీబీగా ఉన్న డేటా పరిమితిని ఇప్పుడు 1.5జీబీకి పెంచారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్, ఇతర అవసరాలకు ఎక్కువ డేటా వాడే వారికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *