భారీగా పెరిగిన యూపీఐ వాడకం.. రోజుకు రూ.90,000 కోట్లకు పైగా లావాదేవీలు

V. Sai Krishna Reddy
1 Min Read

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో రోజువారీ లావాదేవీల విలువ ఏకంగా రూ.90,000 కోట్లను దాటింది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‍బీఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో యూపీఐ వాడకం ఏ స్థాయిలో పెరిగిందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

2025లో యూపీఐ లావాదేవీల విలువ, సంఖ్య రెండింటిలోనూ గణనీయమైన వృద్ధి నమోదైనట్లు ఎస్‍బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో రోజువారీ సగటు లావాదేవీల విలువ రూ.75,743 కోట్లుగా ఉండగా, జులై నాటికి అది రూ.80,919 కోట్లకు చేరింది. ఆగస్టులో ఈ జోరు మరింత పెరిగి, రోజువారీ సగటు విలువ రూ.90,446 కోట్లకు చేరుకుందని నివేదిక వివరించింది.

లావాదేవీల విలువలోనే కాకుండా, సంఖ్య పరంగా కూడా యూపీఐ వాడకం భారీగా పెరిగింది. జనవరితో పోలిస్తే ఆగస్టు నాటికి రోజువారీ లావాదేవీల సంఖ్య 127 మిలియన్లు పెరిగి, మొత్తం 675 మిలియన్లకు చేరుకుంది. చిన్న మొత్తాల బదిలీల నుంచి పెద్ద మొత్తాల చెల్లింపుల వరకు అన్ని రకాల అవసరాలకు భారతీయులు యూపీఐపై ఎక్కువగా ఆధారపడుతున్నారని ఇది స్పష్టం చేస్తోంది.

ఇదే సమయంలో, యూపీఐ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న అగ్రగామి బ్యాంకుల వివరాలను కూడా ఈ నివేదికలో పొందుపరిచారు. అత్యధికంగా 5.2 బిలియన్ల లావాదేవీలను నిర్వహించి, టాప్ రెమిటర్‌గా ఎస్‍బీఐ నిలిచినట్లు నివేదిక పేర్కొంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *