సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై మొదటిసారి స్పందించారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి ఆమె ఫుల్స్టాప్ పెట్టారు. ధనుశ్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మృణాల్ మాట్లాడుతూ, “ధనుశ్ నాకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమే” అని వివరించారు. తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆమె పేర్కొన్నారు. ఈ పుకార్లన్నీ నిరాధారమైనవని మృణాల్ కొట్టిపారేశారు.
గత కొద్ది కాలంగా పలు కార్యక్రమాల్లో ధనుశ్, మృణాల్ కలిసి కనిపించడంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2′ చిత్ర స్క్రీనింగ్కు ధనుశ్ హాజరుకావడంతో ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. దీనిపై మృణాల్ వివరణ ఇస్తూ, “ఆ కార్యక్రమానికి ధనుశ్ను అజయ్ దేవగణ్ గారు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకే ధనుశ్ వచ్చారు. దీన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు” అని కోరారు.
సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈవెంట్కు ముందు, ధనుశ్ నటిస్తున్న ‘తేరే ఇష్క్ మే’ సినిమా ర్యాప్-అప్ పార్టీకి కూడా మృణాల్ హాజరయ్యారు. ఈ రెండు సందర్భాల్లో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, మృణాల్… ధనుశ్ సోదరీమణులను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది.
కాగా, 2022లో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో తన 18 ఏళ్ల వైవాహిక బంధానికి ధనుశ్ ముగింపు పలికిన విషయం తెలిసిందే. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తాజా వివరణతో ధనుశ్తో తనకున్న బంధంపై వస్తున్న ప్రచారానికి మృణాల్ తెరదించారు.