పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఇబ్బందులు లేని బుకింగ్ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’ అనే సరికొత్త పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ పథకం కింద వెళ్లే, వచ్చే ప్రయాణాలకు కలిపి టికెట్లు బుక్ చేసుకునే వారికి తిరుగు ప్రయాణం బేస్ ఫేర్లో 20 శాతం రాయితీ లభిస్తుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ప్రయాణికులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వెళ్లే ప్రయాణానికి, తిరుగు ప్రయాణానికి ఒకేసారి టికెట్లు బుక్ చేసుకోవాలి. ప్రయాణికుల వివరాలు, ప్రయాణించే క్లాస్, బయలుదేరే స్థానం, గమ్యస్థానం రెండింటికీ ఒకేలా ఉండాలి. ఈ పథకం కింద టికెట్ల బుకింగ్ ఈ నెల 14న ప్రారంభమవుతుంది.
ఈ ఆఫర్ నిర్దిష్ట తేదీలలో ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 26 మధ్య ప్రారంభమయ్యే రైళ్లలో వెళ్లే ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవాలి. అనంతరం, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ప్రారంభమయ్యే రైళ్లలో తిరుగు ప్రయాణానికి ‘కనెక్టింగ్ జర్నీ’ ఫీచర్ను ఉపయోగించి టికెట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణ టికెట్ బుకింగ్కు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ఏఆర్పీ) వర్తించదని రైల్వే స్పష్టం చేసింది.
అయితే, ఈ పథకానికి కొన్ని కఠినమైన షరతులు కూడా ఉన్నాయి. ఈ స్కీమ్ కింద బుక్ చేసుకున్న టికెట్లకు ఎలాంటి రీఫండ్ ఇవ్వబడదు. అలాగే, టికెట్లలో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. రెండు వైపులా కన్ఫర్మ్ అయిన టికెట్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉన్న రైళ్లు మినహా అన్ని రైళ్లు, అన్ని క్లాసులలో ఈ పథకం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్.. ఏ పద్ధతిలోనైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కానీ, రెండు టికెట్లనూ ఒకే విధానంలో బుక్ చేయాల్సి ఉంటుంది. పండుగల సమయంలో రద్దీని నియంత్రించి, రైళ్ల వినియోగాన్ని రెండు వైపులా పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని రైల్వే శాఖ వివరించింది.