ట్రంప్ పేకమేడ కూలిపోతుంది.. భారత్‌పై టారిఫ్‌లు నిలవవు: అమెరికన్ ఆర్థికవేత్త

V. Sai Krishna Reddy
2 Min Read

భారత్‌తో వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తనను తానే నాశనం చేసుకుంటున్నారని ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త, జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే తీవ్రంగా విమర్శించారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ ఏకపక్షంగా విధిస్తున్న టారిఫ్‌లు అర్థరహితమని, ఆయన ఆర్థిక విధానాలు పూర్తిగా తప్పని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత ఉత్పత్తులపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు పూర్తిగా చెత్త నిర్ణయమని, అది ఇసుక మీద కట్టిన మేడలాంటిదని ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. “నెపోలియన్ చెప్పినట్టు, శత్రువు తనను తాను నాశనం చేసుకుంటున్నప్పుడు మనం జోక్యం చేసుకోకూడదు. ప్రస్తుతం ట్రంప్ అదే పని చేస్తున్నారు” అని హాంకే అన్నారు. ట్రంప్ పేకమేడ త్వరలోనే కూలిపోతుందని, కాబట్టి ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ కాస్త వేచి చూసే ధోరణి అవలంబించాలని ఆయన సూచించారు.

రష్యా నుంచి భారత్ నిరంతరాయంగా చమురు దిగుమతి చేసుకుంటుండటాన్ని కారణంగా చూపుతూ, భారత వస్తువులపై అమెరికా మొదట 25 శాతం, ఆ తర్వాత దానిని అదనంగా మరో 25 శాతం పెంచి మొత్తం 50 శాతానికి చేర్చింది. బ్రెజిల్‌తో పాటు భారత్ కూడా ఇప్పుడు అమెరికా నుంచి అత్యధికంగా 50 శాతం టారిఫ్‌లను ఎదుర్కొంటున్న దేశంగా నిలిచింది.

అమెరికా చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది ‘అన్యాయమైన, అసమంజసమైన’ చర్య అని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల దేశంలోని టెక్స్‌టైల్స్, మెరైన్, లెదర్ వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మరోవైపు, భారత్‌పై అక్రమంగా ఒత్తిడి తెస్తున్నారంటూ రష్యా, చైనాలు కూడా ట్రంప్‌పై విరుచుకుపడ్డాయి.

అయితే, ఈ విమర్శలను ట్రంప్ తోసిపుచ్చారు. టారిఫ్‌ల వల్ల దేశ ఖజానాకు వందల బిలియన్ డాలర్లు వస్తున్నాయని, స్టాక్ మార్కెట్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతోందని ఆయన ‘ట్రూత్ సోషల్’ వేదికగా పేర్కొన్నారు. టారిఫ్‌లపై వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని కూడా ఆయన తేల్చి చెప్పారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *