ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ప్రేక్షకులను అలరించి, భారీ హిట్స్ గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా వచ్చిన ఓ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్, భారీ సెట్లు ఇలా ఏవీ లేకుండానే వచ్చిన ఆ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆ సినిమానే ‘మహావతార్ నరసింహ’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహ థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థం హోంబలే ఫిల్మ్స్ వెల్లడించింది. “అన్ని రికార్డులను అధిగమించి, కేవలం 8 రోజుల్లో రూ. 60.5 కోట్లకు పైగా వసూలు చేసి భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది” అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. కాగా, మహా విష్ణువు దశావతారాల ఆధారంగా పదేళ్లపాటు వరుసగా సినిమాలు రూపొందనున్నాయి. ‘మహావతార్’ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఓ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.