ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైంది. అధికారిక వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంచినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేసిన అనంతరం అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించారు.
ఈ అభ్యంతరాలను విషయ నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి తుది కీ రూపొందించినట్లు డీఎస్సీ కన్వీనర్ తెలిపారు. ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబడవని ఆయన స్పష్టం చేశారు. కీ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం విదితమే. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు సెషన్లలో పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. మెగా డీఎస్సీ పరీక్షలకు 92.90 శాతం మంది హాజరు కాగా, త్వరలో డీఎస్సీ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.