తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీనిపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్న సూత్రం వర్తించకూడదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
కాగా, తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరపున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ని బీఆర్ఎస్ కోరింది. స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండటంతో ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు.. స్పీకర్ను 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పగా.. స్పీకర్.. తనను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదు అన్నారు. దాంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తాము స్వయంగా వేటు వెయ్యలేమన్న సుప్రీంకోర్టు.. దీనిపై మూడు నెలల్లో స్పీకరే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.