పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమైన చిత్రం జూనియర్. నిన్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలీల, జెనిలియా డిసౌజా, రవిచంద్రన్, రావు రమేశ్, ఆచ్యుత్ రావు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. సాయి శివానీ సమర్పణలో వరాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్లపై రజనీ కొర్రపాటి నిర్మించారు.
తెలుగుతో పాటు కన్నడ భాషలో ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు తెలుగులో మంచి ఆదరణ లభించడంతో తెలుగు ప్రేక్షకులకు కిరీటి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు పెట్టారు.
“తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. ‘జూనియర్’కు వస్తున్న ప్రేమ, ఆదరణను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఎంతో నిజాయితీగా, హృదయపూర్వకంగా ఈ సినిమాను తీశాం. మీకు మంచి సినిమాలు అందించడానికి మేము ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటాం. మీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అంటూ కిరీటి తన పోస్టులో రాసుకొచ్చారు.