ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేశారు. ఉదయాన్నే కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అడ్డుకున్న క్యూ న్యూస్ సిబ్బందిపైనా దాడి చేశారు. దాడి సమయంలో తీన్మార్ మల్లన్న ఆఫీసులోనే ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ మల్లన్న గన్ మెన్లు గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్యూ న్యూస్ ఆఫీసును పరిశీలించారు.
దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగిందని, జాగృతి కార్యకర్తలే దాడి చేశారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, దుండగులు సృష్టించిన బీభత్సం, కార్యాలయంలో రక్తపు మరకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.