ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఏకంగా 29 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసులు నమోదు చేసింది. ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల వంటి వారి పేర్లు ఈ జాబితాలో ఉండటం టాలీవుడ్లో కలకలం రేపుతోంది.
గతంలో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని ఈడీ ఈ దర్యాప్తును చేపట్టింది. ఈ సెలబ్రిటీలు భారీ మొత్తంలో పారితోషికాలు తీసుకుని, నిషేధిత బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారన్నది ప్రధాన ఆరోపణ. వీరి ప్రచారం కారణంగా ఎంతోమంది యువత ఈ యాప్ల బారిన పడి, ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలీసుల ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఈ కేసులో యాంకర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతుతో పాటు పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను కూడా చేర్చారు. తెలంగాణ గేమింగ్ చట్టం, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇప్పుడు ఈడీ దర్యాప్తుతో ఈ కేసు మరింత తీవ్రరూపం దాల్చింది. త్వరలోనే వీరందరినీ విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.