భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఒకప్పుడు వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మన దేశం, ప్రస్తుతం పారిశ్రామికంగా ఎంతో పురోగతి సాధించింది. ఐటీ ఎగుమతులు లక్షల కోట్లకు చేరుకొని, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచాయి. అయితే, అదే స్థాయిలో ఆర్థిక అసమానతలు కూడా పెరిగిపోతున్నాయి. దేశంలోని మొత్తం సంపదలో 40% ఇప్పటికీ కేవలం 1% మంది సంపన్నుల వద్దే ఉండటం ఇందుకు స్పష్టమైన నిదర్శనం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బ్రిటీష్ పాలనలో కూడా ఇటువంటి తీవ్రమైన ఆర్థిక అసమానతలు లేవని చెబుతున్నారు. ఆర్థిక అసమానతలు ఇలా… భారతదేశంలో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయి. సంపన్న వర్గం, సామాన్య ప్రజల మధ్య ఆదాయం, సంపద పంపిణీలో భారీ అంతరం ఏర్పడింది. దేశంలోని 1% సంపన్నులు దాదాపు 40% సంపదను నియంత్రిస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థలో అసమానతలు ఎంత తీవ్రంగా ఉన్నాయో సూచిస్తుంది. ఆర్థిక అసమానతను కొలిచే జిని సూచీ ప్రకారం, భారతదేశంలో ఆర్థిక అసమానతలు 1990వ దశకం నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. 2010లో ఈ సూచీ 0.33 ఉండగా, ఇటీవలి అంచనాల ప్రకారం ఇది 0.36కి చేరింది. ప్రపంచ బ్యాంక్ నివేదికల ప్రకారం, 2011–12లో 27.1% ఉన్న తీవ్ర పేదరిక రేటు 2022–23 నాటికి 5.3%కి తగ్గినప్పటికీ, సంపన్న వర్గాల ఆదాయం గణనీయంగా పెరిగింది. పేదరికం ఇంకా ఒక సమస్యగానే మిగిలిపోయింది.
ఆర్థిక అసమానతలకు కారణాలు… భారతదేశంలో ఆర్థిక అసమానతలకు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు ఉన్నాయి: వేగవంతమైన జనాభా పెరుగుదల ఉపాధి అవకాశాలను దెబ్బతీసి, నిరుద్యోగంతో పాటు ఆర్థిక అసమానతలను పెంచుతోంది. కుటీర పరిశ్రమల క్షీణత తో గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు క్షీణించడం, పారిశ్రామికీకరణతో గ్రామీణ–పట్టణ ఆదాయ అంతరం పెరిగింది. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణ విధానాలు ఆర్థిక వృద్ధిని పెంచినప్పటికీ, సంపద పంపిణీ అసమానంగా జరిగింది. సంపన్న వర్గాలు, పట్టణ ప్రాంతాలు ఎక్కువ ప్రయోజనం పొందాయి. విద్యా అవకాశాలు, నైపుణ్య శిక్షణలో అసమానతలు ఆర్థిక అసమానతలకు దోహదం చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని సంపన్న వర్గాలు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలను పొందుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలకు ఇవి అందుబాటులో లేవు. స్త్రీ, పురుష వివక్ష, కుల వివక్ష వంటివి కూడా ఆర్థిక అసమానతలకు కారణమవుతున్నాయి. – ప్రభుత్వ విధానాలు, అవినీతి… ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ పథకాలు పేదరిక నిర్మూలనకు దోహదపడినప్పటికీ, అవినీతి మరియు అసమర్థ అమలు వలన ఈ పథకాల ప్రయోజనం అందరికీ సమానంగా చేరడం లేదు. పన్ను విధానాలు, సబ్సిడీలు తరచూ సంపన్న వర్గాలకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వం మరియు సమాజం కలిసి పనిచేస్తేనే ఈ అసమానతలను తగ్గించి, సమతుల్య ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు.