బాలానగర్ ఫ్లైఓవర్‌పై ఒకేచోట రెండు ప్రమాదాలు.. ఒకరి మృతి, ఎస్ఐకి గాయాలు

V. Sai Krishna Reddy
1 Min Read

హైదరాబాద్ నగరంలోని బాలానగర్ ఫ్లైఓవర్‌పై మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక ప్రమాదం జరిగిన చోటే మరికాసేపటికి మరో ప్రమాదం జరిగింది. ఈ జంట ప్ర‌మాదాల్లో ఒకరు మరణించగా, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం… బాలానగర్ పైవంతెనపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించడం ప్రారంభించారు.

అయితే, పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఊహించని రీతిలో మరో ప్రమాదం జరిగింది. అదే మార్గంలో వచ్చిన ఒక డీసీఎం వ్యాన్ అదుపుతప్పి, విచారణ జరుపుతున్న పోలీసు సిబ్బందిని ఢీకొట్టింది. ఈ రెండో ప్రమాదంలో బాలానగర్ ఎస్ఐ వెంకటేశంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, ఆయన్ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఈ జంట ప్రమాదాలకు కారణమైన కారు డ్రైవర్‌ను, డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే ప్రదేశంలో స్వల్ప వ్యవధిలో రెండు ప్రమాదాలు జరగడంతో ఫ్లైఓవర్‌పై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *