ప్రధాని మోదీ విదేశీ పర్యటన.. 8 రోజులు, 5 దేశాల్లో పర్యటన

V. Sai Krishna Reddy
2 Min Read

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. జులై 2వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను సందర్శిస్తారు. బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు, గ్లోబల్ సౌత్‌లోని కీలక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.

దశాబ్దాల తర్వాత కీలక దేశాల్లో పర్యటన

విదేశాంగ శాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాని మోదీ తన పర్యటనను జులై 2న ఆఫ్రికా దేశం ఘనాతో ప్రారంభిస్తారు. జులై 3 వరకు అక్కడే ఉంటారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆర్థికం, ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చిస్తారు. అనంతరం జులై 3, 4 తేదీల్లో కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తారు. 1999 తర్వాత ఈ దేశంలో భారత ప్రధాని పర్యటించడం కూడా ఇదే ప్రథమం.

అర్జెంటీనాతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు

అక్కడి నుంచి ప్రధాని నేరుగా దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాకు వెళ్తారు. జులై 4, 5 తేదీల్లో ఆ దేశంలో పర్యటిస్తారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో మోదీ విస్తృతంగా చర్చిస్తారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఇరువురు నేతలు దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

బ్రిక్స్ సదస్సులో కీలకోపన్యాసం

అర్జెంటీనా పర్యటన ముగిశాక, ప్రధాని మోదీ జులై 5 నుంచి 8వ తేదీ వరకు బ్రెజిల్‌లో పర్యటిస్తారు. రియో డి జనీరో వేదికగా జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రపంచ పాలనా సంస్కరణలు, శాంతి భద్రతలు, కృత్రిమ మేధస్సు వినియోగం, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై ప్రధాని తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. సదస్సు సందర్భంగా పలు దేశాధినేతలతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. చివరగా, జులై 9న నమీబియాకు చేరుకుని ఆ దేశంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రధాని నమీబియా పార్లమెంటులో ప్రసంగించే అవకాశం కూడా ఉందని సమాచారం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *