మహబూబ్ నగర్ జూన్ 29 ( ప్రజా జ్యోతి ప్రతినిధి ) మహబూబ్ నగర్ లో జర్నలిస్టుల ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్య పై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాపితంగా ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఫెడరేషన్ రాష్ట్ర నాయకుల బృందం పట్టణంలోని టీటీడి కళ్యాణమండపం ఎదురుగా నిర్వహిస్తున్న జర్నలిస్టుల రిలే దీక్షా శిభిరాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుత, జిల్లాలో గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను లబ్ధిదారులకు స్వాధీనపర్చక పోవడం సరైందికాదని అన్నారు. పట్టాలిచ్చిన ఇండ్లను జర్నలిస్టులకు స్వాధీనపర్చకుండా ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం, స్థానిక జిల్లా అధికార యంత్రాంగం వివక్ష చూపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే సమస్యను పరిష్కరించి జర్నలిస్టుల దీక్షలను విరమింప జేయాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు.
విలేకరి దాసరి నరసింహ సంస్మరణ సభ :
సోమవారం 30వ తేదీన మహబూబ్ నగర్ పట్టణంలోని ఆర్ & బి ఈ ఈ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల రిలే దీక్షా శిబిరం వద్ద ఉదయం 11గంటలకు జర్నలిస్ట్ దాసరి నరసింహ సంస్మరణ సభ కార్యక్రమాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మహబూబ్
అధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షుడు వాకిటి అశోక్ తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని, కావున జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ప్రజాసంఘాల ప్రతినిధులు రాజకీయ నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు, ఈ సందర్భంగా పాలమూరు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చావేదిక ఉంటుందని పేర్కొన్నారు.
దీక్ష శిభిరాన్ని సందర్శించిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుడితాడు బాపురావు వున్నారు. వీరితో పాటుగా జిల్లా అధ్యక్షకార్యదర్శులు వాకిట అశోక్ కుమార్, మొలకల పల్లి గోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, ఐఫ్ డబ్ల్యూ జె ఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు ఉమామహేశ్వర రావు,ఎక్ట్రానిక్ బాద్యులు పసుపుల శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం డి రఫీ,అనిల్, రవి కుమార్ లు తదితరులున్నారు.