మమ్మల్ని పట్టుకోలేరు… బీజేపీ ఎంపీ రఘునందన్ కు మరోసారి బెదిరింపులు

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు, మరోసారి ప్రాణహాని తలపెడతామంటూ మరోసారి హెచ్చరికలు వచ్చాయి.

ఆదివారం రెండు వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేసిన ఆగంతకులు, ఛత్తీస్ గఢ్ లో ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తాము ఏపీ మావోయిస్టు కమిటీకి చెందిన వారిమని, తమ ఆదేశాల మేరకు ఐదు ప్రత్యేక బృందాలు ఇప్పటికే హైదరాబాద్‌లో రంగంలోకి దిగాయని వారు చెప్పినట్టు సమాచారం. “మా టీమ్‌లు నగరంలోనే ఉన్నాయి. మరికాసేపట్లోనే నిన్ను చంపేస్తాం. దమ్ముంటే నిన్ను నువ్వు కాపాడుకో” అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

పోలీసులు తమ ఫోన్లను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా తమ ఆచూకీ దొరకదని, ఎందుకంటే తాము ఇంటర్నెట్ కాల్స్ ఉపయోగిస్తున్నామని ఆ వ్యక్తులు స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పినట్లు తెలిసింది.

రఘునందన్‌రావుకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది రెండోసారి. గత జూన్ 23న తొలిసారిగా ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ సమయంలోనే ఆయన రాష్ట్ర డీజీపీతో పాటు మెదక్, సంగారెడ్డి ఎస్పీలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచి, ఎస్కార్ట్ వాహనంతో పాటు అదనపు సిబ్బందిని కేటాయించింది. అయినప్పటికీ బెదిరింపులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

రెండు రోజుల క్రితమే కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న రఘునందన్‌రావు, ప్రస్తుతం ఆసుపత్రిలోనే కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా బెదిరింపులు రావడంతో ఆయన ఆసుపత్రి నుంచే మరోమారు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *