ఏసీబీకి చిక్కిన ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు.
ఇంటి నంబర్ కోసం 5000 డిమాండ్.
చివరకు ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు ఆర్నకొండ ప్రసాద్.
సుల్తానాబాద్, జూన్ 28 (ప్రజా జ్యోతి): తనకు ఇంటి నంబరు కావాలని సంవత్సర కాలంగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన కానీ ఇంటి నెంబర్ ఇవ్వకపోవడంతో బాధితుడు చివరకు ఏమి చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఆర్నకొండ ప్రసాద్ అనే వ్యక్తి. శనివారం కరీంనగర్ ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం పై దాడులు నిర్వహించి, మున్సిపల్ కార్యాలయంలో ఇన్చార్జి ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న వినోద్ తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి బిల్ కలెక్టర్ గా గత కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్న నాంపల్లి విజయ్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు ఆర్నకొండ ప్రసాద్ తన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని, తనకు ఇంటి నెంబర్ కేటాయించాలని సంవత్సర కాలంగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగానని అయినా కానీ అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ మొదట పదివేల రూపాయలు డిమాండ్ చేసి, తర్వాత 5000 రూపాయలు ఇస్తే కానీ ఇంటి నెంబర్ ఇవ్వమని చెప్పడంతో తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించానని తన ఆవేదనను వెలిబుచ్చారు. ఆర్నకొండ ప్రసాద్ తన షాప్ కు పిలిపించి ఏసీబీ అధికారులు ఇచ్చిన 5000 రూపాయల నగదును అందజేయడంతో, కరీంనగర్ ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకొని ఇద్దరు అవినీతి మున్సిపల్ ఉద్యోగులను కస్టడీలోకి తీసుకొని అరెస్టు చేశారు.