టాలీవుడ్ డైనమిక్ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘కన్నప్ప’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి ఆట నుంచే ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది. సినిమాకు వస్తున్న స్పందన చూసి తనకు ఆనందంతో మాటలు రావడం లేదని మంచు విష్ణు అన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విష్ణు, “అన్ని చోట్ల నుంచి ‘కన్నప్ప’కు చాలా మంచి స్పందన వస్తోంది. ఈ విజయం ఇలాగే కొనసాగాలని పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సినిమా వాళ్లకు కనిపించే దేవుళ్లు ప్రేక్షకులే. వారు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ఈ విజయాన్ని ముందుగా నా కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాను” అని తన సంతోషాన్ని పంచుకున్నారు.
మరోవైపు, ఈ చిత్రంపై సినీ పరిశ్రమ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమా చూసిన మంచు మనోజ్, తాను ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు అద్భుతంగా ఉందని కొనియాడారు. ప్రముఖ నిర్మాత నాగవంశీ సైతం స్పందిస్తూ, ఈ శుక్రవారం మంచు విష్ణుదేనని అన్నారు. “కన్నప్ప చిత్రానికి లభిస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. విష్ణు ఇన్నాళ్లూ పడిన కష్టానికి సరైన ప్రతిఫలం దక్కింది. తనను ప్రశ్నించిన వారందరికీ ఈ సినిమాతో సరైన సమాధానం ఇచ్చాడు” అని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా, నిర్మాత ఎస్కేఎన్ కూడా విష్ణు నటనను, కథ ఎంపికను మెచ్చుకున్నారు. ఇంత గొప్ప కథను ప్రేక్షకులకు చెప్పడం అభినందనీయమని, ఈ చిత్రంలో విష్ణు నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు ‘కన్నప్ప’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కన్నప్ప చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ చేయడం తెలిసిందే. ఇందులో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి దిగ్గజాలు నటించారు.