నిజామాబాద్ జిల్లా రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం ఆయన ఈ నెల 29వ తేదీన నిజామాబాద్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి బీజేపీ వర్గాలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. జిల్లా రైతుల చిరకాల డిమాండ్గా ఉన్న పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.