సమాజంలో కుటుంబ బంధాలు దెబ్బతింటున్నాయని, ఒకప్పుడు భర్త క్షేమాన్ని కోరుకున్న భార్యలే ఇప్పుడు వారి ప్రాణాలు తీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల మోజులో పడి భర్తలను హత్య చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంపై ఆయన ఆందోళన చెందారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్వకాలంలో భార్యలు… తమ భర్తలను కాపాడాలని దేవుళ్లను ప్రార్థించేవారని, కానీ నేటి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయని వీహెచ్ అన్నారు. “ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోండి, అంతేకానీ వివాహేతర సంబంధాల కోసం తల్లిదండ్రులను, భర్తలను చంపకండి” అని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరం నంబర్ వన్ స్థానంలో నిలవాలంటే ఇలాంటి చెడు సంప్రదాయాలకు, దురాచారాలకు ముగింపు పలకాలని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ వ్యవస్థ పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వీహెచ్ గుర్తుచేశారు. భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలని, పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకున్నప్పుడే కుటుంబం బాగుంటుందని హితవు పలికారు.