హుజూర్ నగర్ పెండింగ్ కేసుల పరిష్కారంలో న్యాయవాదులు సహకరించాలని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి ఆయేషా సరీన అన్నారు. సోమవారం స్థానిక న్యాయస్థానాల ప్రాంగణంలో బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన స్వాగత సమావేశంలో ఆమె మాట్లాడారు.బార్ అసోసియేషన్ సభ్యులు తన పూర్వ న్యాయమూర్తులకు ఇచ్చిన సహకారాన్ని తనకు అందిస్తారనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. తన నుంచి గాని తన సిబ్బంది నుంచి గాని ఏదైనా ఇబ్బంది కలిగితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో తన వంతు ప్రయత్నం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా తనకు పూర్తిగా సహకరిస్తున్నందుకు న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సహకారాన్ని తన తోటి న్యాయమూర్తికి కూడా అందించాలని కోరారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సామల రామిరెడ్డి మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారంలో, విధుల నిర్వహణలో న్యాయమూర్తులకు తమ న్యాయవాదులు పూర్తిగా సహకరిస్తారని న్యాయమూర్తులకు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఇరువురు న్యాయమూర్తులను బార్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువా, బొకే, పూలమాల లతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చనగాని యాదగిరి, ఉపాధ్యక్షులు జక్కుల నాగేశ్వరరావు, మహిళా న్యాయవాదులు రేణుకా దేవి, తెప్పని శ్రీలక్ష్మి, మంత్రి ప్రగడ దీపిక, జుట్టుకొండ సంధ్య, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఏజీపీలు, అడిషనల్ పీ పీలు తదితరులు పాల్గొన్నారు.