తెలంగాణా ఉద్యమ కర్త బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముద్దుల తనయ కవిత ఆ పార్టీ నుంచి పూర్తిగా అవుట్ అయ్యారా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. ఆమె వ్యూహాత్మకంగా చేసిందో లేక ఆమె పొరపాటుగా చేసిందో తెలియదు కానీ ఏకంగా కేసీఅర్ నే టార్గెట్ చేసే విధంగా బహిరంగమైనపోయింది. లేఖల ద్వారా మీడియా ద్వారా ఆమె కేసీఅర్ నే ప్రశ్నించినట్లుగా ఆమె వ్యవహారశైలి ఉంది అని అంటున్నారు. కేసీఆర్ ని దేవుడు అని అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అనడం ద్వారా కవిత బీఆర్ఎస్ లో లోపల ఏమి జరుగుతోందో చెప్పకనే చెప్పేశారు అని అంటున్నారు. ఒక విధంగా ఇది కేసీఅర్ కే ఇబ్బంది కలిగించేలా ఉంది అని అంటున్నారు.
దాంతో కేసీఆర్ కుమార్తె పట్ల ఆగ్రహంగా ఉన్నారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఆమెతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదని ప్రచారమూ సాగింది. ఆ విషయం అలా ఉంచితే ఏపీలో వైఎస్ షర్మిల మాదిరిగానే తెలంగాణాలో కవిత పోరాటం కూడా ఒంటరి బాట పట్టనుందా అని అంటున్నారు. షర్మిల విషయానికి వస్తే వాళ్ళ నాన్న వైఎస్సార్ జీవించి ఉన్నపుడు బాగా చూసుకున్నారు జగన్ కూడా అంతే బాగా చూసుకున్నారు. వైఎస్సార్ మరణానంతరం జగన్ షర్మిల మధ్య విభేదాలు వచ్చాయని చెబుతారు. అయితే తెలంగాణాలో కేసు వేరు. ఇక్కడ కవితకు వాళ్ళ నాన్న కేసీఆర్ ఉన్నపుడు అది కూడా ఆయన బీఆర్ఎస్ అధినేతగా కొనసాగుతున్నపుడే విభేదాలు రావడమే విస్మయం కలిగిస్తోంది అని అంటున్నారు. ఒక విధంగా ఆదరణ ఆమెకు కరవు అయిందని అంటున్నారు.
ప్రస్తుతానికి చూస్తే కేసీఆర్ కి కవిత మీద పీకల దాకా కోపం ఉంది అని అంటున్నారు. కవిత తెలిసో తెలియకో బీఆర్ఎస్ మీద చేసిన కామెంట్స్ ఆ పార్టీకి ఎంతో తీవ్రంగా నష్టాన్ని కలిగించాయని అంటున్నారు. అంతే కాదు ఒక్కసారిగా బీఆర్ఎస్ ఊపుని తగ్గించి రేసులో వెనక్కి నెట్టేశాయని కూడా టాక్ ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నా కూడా కాంగ్రెస్ కి గ్రాఫ్ తగ్గిపోతోంది అని ఇక వచ్చేది బీఆర్ఎస్ అన్న చర్చ మొదలైన సందర్భంలో ఒక్కసారిగా కవిత లేఖ బయటకు రావడం ఆ మీదట ఆమె మీడియా ముందు చేసిన కామెంట్స్ అన్నీ కలసి బీఆర్ఎస్ ఊపుని తగ్గించేశాయని అంటున్నారు. ఇలా కవిత చేసిన ఈ పొరపాటు వల్లనే బీఆర్ఎస్ కి కోలుకోలేని విధంగా భారీ డామేజ్ అయితే జరిగింది అని అంటున్నారు
కవిత మామూలు వ్యక్తి కాదు, ఆమె ఎమ్మెల్సీగా ఉన్నా అంతకు మించి కేసీఆర్ కుమార్తె. అందుకే ఆమె ఏ చిన్న మాట మాట్లాడినా అంతటి విలువ వచ్చేది. అలా కవిత చేసిన కామెంట్స్ తో ఇపుడు అధికార కాంగ్రెస్ కి ఎక్కడ లేని బలం వచ్చేసింది. అలాగే బీజేపీ కూడా ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకుంటోంది. దాంతో ఈ రెండు పార్టీలు కలసి బీఆర్ఎస్ తో చెడుగుడు ఆడుకుంటున్నాయని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో కవిత తరువాత సర్దుకున్నా జరగాల్సిన పొలిటికల్ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. దాంతో మొన్న కవిత కేసీఆర్ ఇంటికి వెళ్ళినా కూడా తండ్రిగా కూడా కేసీఆర్ ఆమె మీద దయతలచి కనీసంగా పలకరించలేదు అని ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. లిఫ్ట్ దగ్గర కవిత ఉన్నా కూడా కేసీఆర్ ఆమె వైపు తిరిగి ముఖం కూడా చూడలేదు అని గుర్తు చేస్తున్నారు
దాంతో కవితకు మొత్తం మ్యాటర్ అర్ధం అయిపోయింది అని అంటున్నారు. దాంతో ఆమె జాగృతి అని ఒక జెండా పట్టుకుని దాని ద్వారానే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు. ఆమెని బీఆర్ఎస్ నాయకురాలిగా అయితే ఇపుడు ఎవరూ గుర్తించడం లేదు అని అంటున్నారు. ఆమె సోషల్ మీడియా ద్వారా ఫోకస్ కావాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించడం లేదు అని అంటున్నారు. అయితే ఆమె కేవలం కేసీఆర్ కుమార్తె కాబట్టే నిజామాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. ఆ తరువాత రెండవ మారు ఓటమి చెందినా ఎమ్మెల్సీ అయ్యారు. పార్టీలో కీలకం అయ్యారు అని అంటున్నారు. రాజకీయంగా అనుభవం కానీ విషయ జ్ఞానం కానీ ఆమెకు పెద్దగా లేవని కూడా అంటున్నారు. ఇక చూస్తే కవితకు బీఆర్ఎస్ కి మధ్య బంధం ఎపుడో కట్ అయింది. అయితే అధికారికంగా ఆమెను పార్టీ నుంచి బయటకు పంపే కార్యక్రమమే మిగిలి ఉందని అంటున్నారు. అయితే కవిత తన అన్న కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అలాగే కాంగ్రెస్ మీద గట్టిగా విమర్శలు చేస్తున్నారు. ఇలా ఆమె డ్యామేజ్ కంట్రోల్ కి ప్రయత్నం చేస్తున్నా కేసీఅర్ అయితే కరుణించడం లేదని అంటున్నారు. దాంతో ఆమె బీఆర్ఎస్ నుంచి అవుట్ అన్నదే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.