జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ శివారులోని ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. ఇథనాల్ ఫ్యాక్టరీ విధ్వంసం కేసులో అరెస్టయిన 12 మంది రైతులను మహబూబ్నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో సంకెళ్లు వేయడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు.. ఒక ఆర్ఎస్సై , ఇద్దరు ఏఆర్ఎస్సైలను సస్పెండ్ చేశారు. ముగ్గురు సస్పెన్షన్కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. రాజోలి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కేసులోని వ్యక్తులను అధికారుల సూచనలు పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన 12 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. అయితే.. రిమాండ్ ముగియడంతో.. మహబూబ్నగర్ కోర్టు నుంచి అలంపూర్ కోర్టులో హాజరు పరిచేందుకు రైతులకు సంకెళ్లు వేసి తరలించడం చర్చనీయాంశం అయింది. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో.. ప్రభుత్వం చర్యలు తీసుకుంది..
కాగా.. కంపెనీ యాజమాన్యం పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయగా.. జూన్ 4న పెద్దధన్వాడతోపాటు పరిసర గ్రామాల రైతులు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఘటనపై పోలీసులు 41 మందిపై కేసులు పెట్టారు. వారిలో 12 మందిని రిమాండ్కు తరలించారు. రిమాండ్ పూర్తవ్వడంతో న్యాయమూర్తి బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేశారు. దీంతో రైతులను అలంపూర్ నుంచి మహబూబ్నగర్ జైలుకు తరలించి అక్కడ విడుదల చేశారు.