వెనుకబడ్డ పేద, బలహీన వర్గాలకు విద్య హక్కు చట్టం ప్రకారం ఫీజులు వసూలు చేయాలి
– తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక
పరిగి, జూన్ 17 (ప్రజాజ్యోతి) :
ప్రైవేటు పాఠశాలల్లో 46 జీవోను అనుసరించి ఆర్థికంగా వెనుకబడ్డ పేద, బలహీన వర్గాలకు 25% ఉచితంగా సీట్లు కేటాయించి విద్య హక్కు చట్టం ప్రకారం ఫీజులు వసూలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం పరిగి మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ గోపాల్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్, మానవ హక్కుల కమిషన్ జిల్లా అధ్యక్షులు మంచన్ పల్లి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం (ఆర్టిఇ) 2009, జీవో నెంబర్ 46 ను అనుసరించి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజులు తీసుకోవాలని, ప్రతి ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడ్డ పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచితంగా సీట్లు కేటాయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని, ఈ విద్యా సంవత్సరంలో విచ్చలవిడిగా ఫీజులు పెంచుతూ, పాఠ్యపుస్తకాలు, అడ్మిషన్ ఫీజులు అంటూ వ్యాపారం చేస్తున్న పాఠశాలలను వెంటనే తనిఖీ చేసి ఫీజులను నియంత్రించాలని అవసరమైతే అటువంటి పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే పూర్తిగా విద్య, వైద్యా రంగాలలో వున్న ప్రైవేటు సంస్థలను రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి పాఠ్య, సహ పాఠ్య కార్యక్రమాలను ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి నాణ్యమైన విద్యాబోధన అందించాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చదువు కొందాం! అనే మాట కాకుండా చదువుకుందాం! అనే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేనియెడల ఇతర విద్యార్థి ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యుడు మక్తల సింగం, పరిగి మండల అధ్యక్షులు కృష్ణ, ఉద్యమకారులు జాన్సన్, గోపాల్, కృష్ణయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.