ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న చొరవను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె శస్త్రచికిత్స చేయించుకోవడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా వేదికగా తన అభినందనలు తెలియజేశారు.
వివరాల్లోకి వెళితే, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో, ఆమె నిన్న కరీంనగర్లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు) విభాగానికి చెందిన నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు విజయవంతంగా ఎండోస్కోపీ నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్టి సర్జరీలను నిర్వహించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎక్స్ వేదికగా స్పందించారు. “ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు, సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు. సర్కారు దవాఖానలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం మాత్రమే ఇప్పుడు కావాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆ నమ్మకాన్ని కలిగించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి నా అభినందనలు” అని తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవడం ద్వారా ప్రజల్లో వాటిపై విశ్వాసం పెరుగుతుందని, కలెక్టర్ పమేలా సత్పతి చర్య ఇందుకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం… సామాన్యులకు కూడా సర్కారు వైద్యంపై భరోసా కల్పించే దిశగా ఒక మంచి పరిణామంగా భావిస్తున్నారు.