ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్న తీరుపై పొంగులేటి విమర్శలు

V. Sai Krishna Reddy
1 Min Read

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరవుతున్న తీరుపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే హంగామా చేశారని, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే పంథాను అనుసరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు చేపట్టే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.

“ఏసీబీ విచారణకు వెళ్తూ కేటీఆర్ ఇంత హడావుడి చేయడం అవసరమా?” అని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. విచారణ అనంతరం ఏసీబీ సమర్పించే నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని మంత్రి వివరించారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధించాలన్న ఆలోచన లేదని పునరుద్ఘాటించారు.

రాబోయే పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుతూ… బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. “త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్లకు మేం కట్టుబడి ఉన్నాం. పెంచిన రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేసి తీరుతాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన జోస్యం చెప్పారు.

అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. “మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఎవరూ నిరాశ చెందవద్దు. దశలవారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇప్పించే బాధ్యత నాది” అని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే అనేక హామీలను నెరవేర్చామని గుర్తుచేశారు. మిగిలిన హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *