సహజంగా చూస్తే నగరాల్లో జీవించలేని మధ్య తరగతి ఉద్యోగులు దూరంగా ఇల్లు తీసుకుంటారు. అక్కడినుంచి ఆఫీసులకు వచ్చి వెళ్లేందుకు సొంత వాహనాలు వాడుతుంటారు. ఇక కార్లు ఉన్నవారి సంగతి సరేసరి. మిగతా నగరాల మాట ఎలా ఉన్నా.. దేశ రాజధాని ఢిల్లీ, టెక్ రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు మామూలుగా చెప్పలేం. అందులోనూ ఢిల్లీలో వర్షాకాలంలో బీభత్సమే. బెంగళూరు ట్రాఫిక్ గత కొన్నేళ్లలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. కేవలం ఈ భయంతోనే అక్కడనుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయనే పేరుంది. ఇప్పటికైతే అంత తీవ్రం కాకున్నా.. టెక్ సిటీ పుణెలోనూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువే అని చెబుతుంటారు.
ప్రజలకు ట్రాఫిక్ నరకం తప్పించేందు ఈ రెండు నగరాల్లో ఎయిర్ బస్ లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందట. మెట్రో నగరాల్లో రద్దీని నివారించేందుకు ఎయిర్ బస్ లు ఓ మార్గం అని కూడా భావిస్తోంది. వీటితో మరో ఉపయోగం కూడా ఉంది. అదేమంటే.. కాలుష్యం నివారణ. మెట్రో సిటీల్లో ఎలివేటెడ్ ఎయిర్ పాడ్ ఆధారిత వ్యవస్థలను తీసుకురానుందని సమాచారం. ముందుంగా ఢిల్లీ, బెంగళూరులో ఎగిరే బస్సులను ప్రవేశపెట్టి ఫలితం ఎలా ఉందో చూడనున్నారు. ఇవి ఎలివేటెడ్ ట్రాక్ లపై పనిచేసే డ్రైవర్ రహిత ఎలక్ట్రిక్ పాడ్ లు అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. ఒక్కో దాంట్లో 135 మంది ప్రయాణించే వీలుంటుందని తెలిపారు. చూద్దాం.. ఈ ప్రయోగం విజయవంతమై.. నగరాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతుందో లేదో?