హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు రెండో దశ పనులకు వారసత్వ కట్టడాల వద్ద అవరోధం ఎదురైంది. చారిత్రక చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలో ఎలాంటి మెట్రో నిర్మాణ పనులు చేపట్టరాదని తెలంగాణ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా కారిడార్-6 పనులను వారసత్వ కట్టడాల పరిరక్షణకు సంబంధించి ఎలాంటి అధ్యయనం చేపట్టకుండానే ప్రారంభిస్తున్నారని యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మెట్రో రెండో దశ పనుల వల్ల చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్తో పాటు పురానీ హవేలి, దారుల్షిఫా మసీద్, మొగల్పురా టూంబ్ వంటి అనేక చారిత్రక కట్టడాల భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారసత్వ కట్టడాలపై పడే ప్రభావంపై సమగ్రమైన అధ్యయనం నిర్వహించకుండా పనులు చేపట్టడం సరికాదని ఆయన వాదించారు. హెరిటేజ్ పరిరక్షణ నిపుణులు, పట్టణ ప్రణాళికా విభాగం నిపుణులు, పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజల ప్రతినిధులతో కూడిన స్వతంత్ర కమిటీ ద్వారా అధ్యయనం చేయించాలని కోరారు.
తెలంగాణ వారసత్వ కట్టడాల పరిరక్షణ చట్టం, కేంద్ర పురావస్తు శాఖ చట్టంలోని నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే పనులు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థించారు. అప్పటివరకు చారిత్రక కట్టడాల సమీపంలో మెట్రో రైలు పనులను నిలిపివేయాలని కోరారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ జరిగే వరకు చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలో మెట్రోకు సంబంధించిన ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.