ట్రంప్ ను చంపేస్తాం.. అల్ ఖైదా అనుబంధ సంస్థ హెచ్చరిక

V. Sai Krishna Reddy
1 Min Read

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమారుస్తామంటూ అల్ ఖైదా అనుబంధ సంస్థ అరేబియన్ పెనున్సులా హెచ్చరించింది. ట్రంప్ తో పాటు ఎలాన్ మస్క్, అమెరికా మంత్రులనూ వదిలిపెట్టబోమని చెప్పింది. ఈ మేరకు అరేబియన్ పెనున్సులా చీఫ్ సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకీ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.

గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ట్రంప్ సహా అతడి మంత్రులను, వైట్ హౌస్ సిబ్బందిని అంతమొందిస్తామని చెప్పాడు. ఈ ప్రతీకారం ప్రపంచంలోని ముస్లింలందరిదని అన్నాడు. ఏ దేశానికి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా సరే మహమ్మద్ ను ప్రవక్తగా నమ్మే వారందరికీ ప్రతీకారం తీర్చుకోవాలంటూ పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా ఒక్క అమెరికాలోనే 4.5 మిలియన్ల మంది ముస్లింలు ఉన్నారని సాద్ బిన్ గుర్తుచేశాడు.

అల్‌ఖైదాలో అరేబియా పెనెన్సులా విభాగమే ప్రస్తుతం అత్యంత చురుగ్గా పనిచేస్తోంది. యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఉగ్రసంస్థ గతంలో ప్రమాదకర దాడులు నిర్వహించింది. బిన్‌ లాడెన్‌ మరణం తర్వాత అత్యంత ప్రమాదకర గ్రూపుగా అవతరించింది. 2024 మార్చిలో అరేబియన్ పెనున్సులా అధిపతిగా సాద్ బిన్ బాధ్యతలు చేపట్టాడు. సాద్ బిన్ తలపై అమెరికా ఇప్పటికే 6 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.

గాజాలో పాలస్తీనా వాసులకు నిలువనీడ లేకుండా చేసినందుకు అమెరికా అధ్యక్షుడు, ఇతర మంత్రులపై భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకోవాలని సాద్ బిన్ పిలుపునిచ్చాడు. అమెరికాలోని లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఎలాంటి హద్దులు లేవని చెప్పాడు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *