9వ అంతస్థు నుంచి అమాంతం కిందకి దూకేసిన తండ్రి, పిల్లలు

V. Sai Krishna Reddy
2 Min Read

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ద్వారకా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. అయితే మంటలను తప్పించుకునే ప్రయత్నంలో తొమ్మిదో అంతస్తు నుంచి ఓ తండ్రి, తన ఇద్దరు కుమారులతో కలిసి కిందకు దూకేశాడు. దీంతో ఆ ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు. ఆ భవనంలోని ఆరో అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి భారీగా ఎగిసిపడటంతో ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన పొరబాటు ముగ్గురిని బలితీసుకుంది. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ -13లోని MRV స్కూల్ సమీపంలో ఉన్న శపథ్ సొసైటీ అనే నివాస భవనంలోని 8, 9 అంతస్తులో మంగళవారం (జూన్‌ 10) ఉదయం 9:58 గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సమాచారం అందించగా, ఘటన స్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. భవనంలో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి అగ్నిమాపక శాఖ స్కై లిఫ్ట్‌ను కూడా మోహరించింది. అయితే అదే భవనంలో మంటల్లో చిక్కుకున్న పదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు, వారి తండ్రి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక్కసారిగా 9వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకి దూకేశారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. తండ్రిని యష్‌ యాదవ్‌ (35)గా గుర్తించారు. యాదవ్ ఫ్లెక్స్ బోర్డు వ్యాపారి. సంఘటన అనంతరం వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక అదే అంతస్థులో ఉన్న యాదవ్ భార్య, వారి పెద్ద కుమారుడిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. వీరిని చికత్స కోసం ఐజిఐ ఆసుపత్రికి పంపబడ్డారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదం సమయంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. అగ్నిమాపక దళానికి చెందిన సిబ్బంది అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. షాపత్ సొసైటీ నివాసితులందరినీ సిబ్బంది ఖాళీ చేయించారు. ప్రమాద తీవ్రతను అరికట్టేందుకు అక్కడి విద్యుత్ సరఫరా, గ్యాస్ కనెక్షన్లను పూర్తిగా ఆపివేశారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *