తెలంగాణలో భారీగా పెరిగిన బస్ పాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. వివిధ రకాల బస్‌పాస్‌ల ధరలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ఛార్జీలు సోమవారం (జూన్ 9) నుంచే అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు వినియోగించే పాస్‌ల ధరలు కూడా పెరిగాయి. సగటున 20 శాతానికి పైగా ఈ పెంపుదల ఉంది.

వివిధ పాస్‌ల పాత, కొత్త ధరలు ఇలా ఉన్నాయి

సాధారణ ప్రయాణికులు ఎక్కువగా వాడే ఆర్డినరీ బస్‌పాస్‌ ధర ఇప్పటి వరకు రూ. 1,150 ఉండగా, దీన్ని రూ. 1,400 కు పెంచారు.
మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ ధర రూ. 1,300 నుంచి రూ.1,600 కు పెంచారు.
మెట్రో డీలక్స్‌ పాస్‌ ధర రూ. 1,450 నుంచి రూ. 1,800కు పెరిగింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వినియోగించే ఇతర పాస్‌లు, గ్రీన్‌ మెట్రో ఏసీ బస్‌పాస్‌ ధరలను కూడా టీజీఆర్టీసీ సవరించింది. ఈ ఆకస్మిక పెంపుదల నెలవారీ పాస్‌లపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం పడనుంది.

ఇటీవల హైదరాబాద్ మెట్రో టిక్కెట్ ధరలను కూడా పెంచారు. ఏడేళ్ల తర్వాత తొలిసారి ధరల పెంపును ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ మే 17న అమల్లోకి తెచ్చింది. మొదట 20 శాతం టిక్కెట్ ధరలను పెంచిన ఎల్ అండ్ టీ, ఆ తర్వాత 10 శాతం తగ్గించింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *