అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. కొమ్మినేనిని ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై సాక్షి టీవీ చర్చలో మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద కొమ్మినేనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.