జూబ్లీహిల్స్‌ MLA మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

V. Sai Krishna Reddy
2 Min Read

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) ఆదివారం (జూన్‌ 8) ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. జూన్‌ 5వ తేదీన ఆయన నివాసంలో గుండెపోటు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. గత 3 రోజులుగా ఆయన ఏఐజీలో గుండె సంబంధిత సమస్యలతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. తొలుత కార్డియాక్‌ అరెస్టుకు గురైనట్లు గుర్తించిన వైద్యులు సీపీఆర్‌ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిచారు. పైగా ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా ఉంది. ఈ క్రమంలో 3 నెలల క్రితం కూడా ఏఐజీలో చేరి డయాలసిస్‌ చేయించుకున్నారు. తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కాగా జూబ్లీహిల్స్‌ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యవత అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌పై ఏకంగా 9 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారి ఘన విజయం సాధించారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో మారి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత విష్ణువర్ధన్‌రెడ్డిపై గెలుపొందారు. ఇక 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్‌ నుంచే మూడోసారి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌పై గెలిచి సత్తా చాటారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లోకి మారినా జనాల్లో చెరగని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

అయితే మాగంటికి కుడి భుజంగా ఉన్న బోరబండకు చెందిన తన అనుచరుడు సర్దార్‌ ఆత్మహత్య చేసుకోవడం, అందుకు కారణమైన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. ఈ మేరకు కుంటుంబ సభ్యులు తెలిపినట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *