ఆ కార్ల తయారీ నిలిపివేసిన మారుతి సుజుకి

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకి కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ మధ్యతరగతి వర్గాల అభిమాన మోడల్ సుజుకి స్విఫ్ట్ కార్ల తయారీని నిలుపుదల చేయాలని నిర్ణయించింది. తమ సంస్థ పాపులర్ కార్ మోడల్ స్విఫ్ట్ తయారీని నిలిపివేయడంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పర్యావరణ కారణాలతో గ్రీన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు, ప్రభుత్వాలు అడుగులు వేయడం, మరోవైపు అమెరికా-చైనా సుంక యుద్ధం, చైనా కొన్ని అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయడంలో ఆంక్షలు విధించడం భారత ఆటోమొబైల్ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని అంటున్నారు. ప్రధానంగా చైనా అరుదైన ఖనిజాల సరఫరాపై ఆంక్షలు విధించడమే దీనికి కారణమని భావిస్తున్నారు.

కొన్ని వారాల క్రితం సుజుకి తన స్విఫ్ట్ మోడల్ కార్ల తయారీని మార్చి 26 నుంచి జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో స్విఫ్ట్ స్పోర్ట్ వెర్షన్‌ను మాత్రం మినహాయించింది. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా ప్రకటన ప్రకారం జూన్ 13 నుంచి తన సగారా ప్లాంట్‌లో స్విఫ్ట్ కార్ల తయారీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.

పూర్తిస్థాయి ఉత్పత్తి జూన్ 16 నుంచి మొదలవుతుందని వెల్లడించింది. ప్రస్తుతం కార్ల తయారీకి అవసరమైన విడిభాగాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. ఏప్రిల్ నెలలో చైనా ఎలక్ట్రిక్ మోటార్స్, ఎలక్ట్రానిక్స్‌తో సహా ఇతర ఉత్పత్తుల తయారీకి వినియోగించే మాగ్నెట్ మెటీరియల్స్ సరఫరాపై కఠిన ఆంక్షలు విధించడంతో ఉత్పత్తి దెబ్బతిన్నదని తెలుస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *