గ్రూప్-3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) షెడ్యూల్ను విడుదల చేసింది. జూన్ 18 నుంచి జులై 8 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో గల సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ (గతంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్శిటీ)లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది.
ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లతో పాటు వెరిఫికేషన్ కొరకు ఏయే సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లాలో ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన గ్రూప్ 3 అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ స్వయంగా సంతకం చేసిన (సెల్ఫ్ అటెస్టెడ్) ఫోటో కాపీలు తీసుకురావాలని టీజీపీఎస్సీ తెలిపింది.