బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బెంగళూరు పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులు ఆర్సీబీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ), డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్లపై సుమోటోగా కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ కథనం ప్రకారం, ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకలను డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వహించగా, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చింది. జరిగిన దుర్ఘటన నేపథ్యంలో, బెంగళూరు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో సెక్షన్ 105 కూడా ఉంది. ఇది నేరపూరిత నరహత్యకు సంబంధించినది.
గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ కేసును క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి అప్పగించాలా వద్దా అనే విషయంపై మంత్రివర్గం సమాలోచనలు చేసింది. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు, కేఎస్సీఏ, ఆర్సీబీ ఫ్రాంచైజీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, పోలీసు సిబ్బంది పాత్రలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దుర్ఘటనకు కారణమైన వైఫల్యాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కేఎస్సీఏ, డీఎన్ఏ నెట్వర్క్స్, ఆర్సీబీ ఫ్రాంచైజీ సరైన అనుమతులు లేకుండానే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ, నిర్వాహకులు సరైన వసతులు కల్పించడంలోనూ, జనసందోహాన్ని నియంత్రించడంలోనూ విఫలమయ్యారని ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్సీబీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్టేడియం గేట్ల వద్ద ఉచిత పాసులు అందుబాటులో ఉన్నాయని పదేపదే పోస్టులు చేయడం, అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడటానికి మరింత ఆజ్యం పోసిందని నివేదిక పేర్కొంది.
ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు, కర్ణాటక ప్రభుత్వం నియమించిన జిల్లా మేజిస్ట్రేట్ జి. జగదీశ కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఆయన గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంను సందర్శించి, తొక్కిసలాట జరిగిన గేట్లను పరిశీలించారు. కేఎస్సీఏ, బెంగళూరు మెట్రో, మరియు ఆర్సీబీ ఫ్రాంచైజీకి నోటీసులు పంపనున్నట్లు జగదీశ తెలిపారు. “నేను ఈ రోజు నుంచే దర్యాప్తు పనులు ప్రారంభించాను” అని ఆయన విలేకరులతో అన్నారు. 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది.