తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం నాడు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమె, సమావేశం ప్రారంభానికి ముందే కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటనతో సచివాలయ సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే, మంత్రి కొండా సురేఖ ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని తెలిసింది. ఈ కారణంగానే ఆమె అస్వస్థతకు లోనై, సచివాలయంలోని తన ఛాంబర్ వద్దకు వెళుతుండగా సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. మంత్రికి షుగర్ లెవెల్స్ పెరిగాయని తెలిసింది. వెంటనే అప్రమత్తమైన మంత్రి వ్యక్తిగత సిబ్బంది ఆమెకు ప్రథమ చికిత్స అందించి, ఆహారం అందజేశారు. కాసేపటికి కొండా సురేఖ తేరుకున్నారు.
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులందరూ సచివాలయానికి చేరుకున్నారు. మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు వెంటనే ఆమె వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు